మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే..కేంద్రం కాల్చి చంపుతామంటోంది : ప్రొఫెసర్ జి.హరగోపాల్

మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే..కేంద్రం కాల్చి చంపుతామంటోంది : ప్రొఫెసర్ జి.హరగోపాల్

ముషీరాబాద్, వెలుగు: మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే చంపుతామని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో గుండెకోట్ ఎన్‌‌‌‌కౌంటర్ మృతుల సంస్మరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, భారత్ బచావో నాయకులు డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపినాథ్ , విరసం నాయకుడు పాణి,  సీఎల్ సీ నేత లక్ష్మణ్ హాజరై మాట్లాడారు.

ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రభుత్వం అణచివేత విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. చర్చలకు సిద్ధమైన విప్లవ పార్టీని తుపాకీతో పరిష్కరిస్తామనడం అమానవీయమన్నారు. ఆపరేషన్ కగార్ ద్వారా హింస కొనసాగవద్దని కోరారు. సమాజ భవిష్యత్తు కోసం శాంతి చర్చలు జరగాలని, శాంతి నెలకొనాలని విజ్ఞప్తి చేశారు.